ఆడ, మగ సమానత్వ భావన ఇంటి నుంచే నేర్పాలి
తల్లిదండ్రుల మాటలు, వ్యవహారాలతో మొదలవ్వాలి
బాలికలు, మహిళల రక్షణకు "మహిళా కమిషన్" విస్తృత కార్యక్రమాలు
త్వరలోనే ఆన్ లైన్ ఫిర్యాదుల పోర్టల్ ఏర్పాటు
ఫోక్సో చట్టంపై అవగాహన కల్పించే దిశగా అడుగులు
మహిళలకు సోషల్ సెక్యూరిటీ పెంచేలా చర్యలు
త్వరలోనే మహిళా కమిషన్ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు
విజయవాడలో 'స్పాట్ లైట్ సెషన్' లో ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ వెల్లడి
విజయవాడ ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఆడామగ సమానత్వం ఇంటి నుంచే నేర్పడం చాలా ముఖ్యం. పిల్లల లింగ సంబంధ అవగాహన, సమాన భావనలు మొదలవ్వాలంటే, తల్లిదండ్రుల మాటలు, వ్యవహారాలతోనే మొదలవ్వాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ పిలుపునిచ్చారు. అబ్బాయిలు అమ్మాయిలు ఒకటేనని, ఇద్దరికీ గౌరవం, ధైర్యం, చదువు సమానంగా ఉండాలన్నారు. లింగ వివక్షకు దూరంగా మాటలు, ప్రవర్తనలు ఉండటం అవసరమన్నారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం (అక్టోబర్ 11న) పురస్కరించుకుని శుక్రవారం విజయవాడ కేబీఎన్ కళాశాలలో 'మహిళా కమిషన్', 'యూజీసీ మహిళా స్టడీ సర్కిల్ కేబీన్ కాలేజీ' సంయుక్త అధ్వర్యంలో 'స్పాట్ లైట్ సెషన్స్' కార్యక్రమానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ హాజరయ్యారు. తొలుత కళాశాల విద్యార్ధినులతో కలిసి స్వేచ్ఛ బెలూన్లను ఎగురవేశారు. అనంతరం జరిగిన స్పాట్ లైట్ సెషన్ లో రాయపాటి శైలజ మాట్లాడారు. కమిషన్ చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన 4 నెలల కాలంలో తాను పరిశీలించిన కేసులను ఆమె ప్రస్తావించారు. లింగ సమానత్వం ఇంటి నుంచే అవగాహన ఉంటే పిల్లల మైండ్సెట్లో సమానత్వం బలంగా మారుతుందన్నారు. పాఠశాలలు కూడా ఇలాంటి సమానత్వ బోధనను ప్రోత్సహించాలన్నారు. టీచర్లు తరగతుల్లో జెండర్ పాత్రల విషయంలో అబ్బాయిలు-అమ్మాయిల మధ్య భేదాభిప్రాయాలు తగ్గించేలా శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు. అలాంటప్పుడే సామాజిక సమానత్వానికి, మహిళ సాధికారతకు పునాది వేస్తుందన్నారు. ఇలాంటి మార్పులు చదువు దగ్గర, కుటుంబం వద్ద రెండు చోట్ల మొదలవ్వాలవ్వాలని కోరారు. మహిళలు, బాలికలకు అండగా ఉంటూ సమస్యలు ఎదుర్కొంటున్న బాధితులకు సోషల్ సెక్యూరిటీ పెంచడానికి మహిళా కమిషన్ ముందంజలో ఉంటుందన్నారు. ఇప్పటికే మహిళా కమిషన్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు, ఒన్ స్టాప్ సెంటర్ల ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నారని చెప్పారు. నిరంతరం మహిళల రక్షణ కోసం లీగల్, సైకాలజిస్ట్, మెడికల్ సౌకర్యాలతో మహిళా కమిషన్ అందుబాటులో ఉందన్నారు. క్రైం రేటులో ఎక్కువగా మహిళలు, బాలికలపై అత్యాచారాలు, వేధింపుల కేసులే నమోదవడంపై దృష్టి సారించి, వాటిని తగ్గించడానికి కృషి చేస్తామన్నారు. మైనర్ల మీద జరుగుతున్న అత్యాచారాలకు సంబంధించిన ఫోక్సో చట్టంపై అవగాహన పెంచేలా మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఐసీడీఎస్, ఒన్ స్టాప్ సెంటర్లు మరిన్ని ఏర్పాటు చేసి సమస్యలను సున్నితంగా పరిష్కరించాలని కమిషన్ నిర్ణయించిందన్నారు. సమస్యలు ఎదురైనా మహిళలు, బాలికలు ఎవరికి చెప్పుకోలేక మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాంటి వారి కోసం మహిళా కమిషన్ తోడుగా ఉంటుందని ... త్వరలోనే ఆన్ లైన్ వెబ్ పోర్టల్ ను ప్రారంభించనున్నట్లు ఆమె వివరించారు. సమస్యను బహిర్గతం చేయకుండా బాధితుల ఉనికి బయటకు తెలియకుండా పరిష్కరించడం కమిషన్ ఉద్దేశమన్నారు. బాధితులకు డైరెక్ట్ కౌన్సిలింగ్తో పాటు ఆన్లైన్ కౌన్సిలింగ్ కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని వివరించారు.
రహస్య విచారణల ద్వారా..:
లైంగిక దాడులకు గురైన మహిళలు, బాలికలకు భరోసా, రక్షణ కోసం మహిళా కమిషన్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న సంగతిని వివరించారు. జరిగిన సంఘటన బాధితుల మైండ్లో లేకుండా డైరెక్ట్గా, లేదా ఆన్లైన్లో కౌన్సిలింగ్ ఇస్తామన్నారు.
ఉమెన్ రిలేటెడ్ కేసులే :
ప్రస్తుతం ఏ కేసు చూసిన ఉమన్ రిలేటెడ్ కేసులే నమోదవుతున్నాయని.. మహిళలు, బాలికలకు చట్టాలపై అవగాహన లేకపోవడతో చాలా మంది మహిళలు ఎదుటి వారి మాటలకు మోసపోయి, హత్యలకు గురుతున్నారన్నారు. హత్యకేసుల్లో నింధితులుగా ఉంటున్నారని, ఆకర్షణకు లోనవుతున్న మైనర్ బాలికలు, వారికి తెలియకుండానే సమస్యల్లో ఇరుక్కుంటున్నారని,కానీ సమస్యను సంబంధిత శాఖ అధికారులకు చెప్పడానికి వెనుకాడుతున్నారని... విమెన్ రిలేటెడ్ కేసులు తగ్గించడం, మైనర్ బాలికలకు అండగా ఉండటానికి కమిషన్ ముందుంటుందన్నారు. బాలిక సంరక్షణ కోసం ఏర్పడ్డ ఫోక్సో యాక్ట్ గురించి, రానున్న రోజుల్లో కాలేజీలు, స్కూళ్లల్లో బాలికలకు అవగాహన కల్పించనున్నామన్నారు. పనిచేసే ప్రాంతాలలో అంతర్గత ఫిర్యాదులు కమిటీ (ఐసీసీ ప్రత్యేక సెల్) ఏర్పాటు చేయడంతో పాటు కంప్లయింట్ చేసే ధైర్యాన్ని మహిళలు, బాలికల్లో కలిగేలా క్యాంపులు ఏర్పాటు చేస్తామన్నారు.
మహిళల్లో మనోధైర్యాన్ని పెంచుతాం..:
వెబ్ పోర్టల్ ద్వారా ఆన్ లైన్ కౌన్సిలింగ్, టోల్ ఫ్రీ నెంబర్ల ఏర్పాటు ద్వారా మహిళల్లో మనోధైర్యాన్ని పెంచుతామని రాయపాటి శైలజ వివరించారు. బాలికల మానసిక వత్తిడి అనేది వారి శారీరక, మానసిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ఇది పెద్దగా ఉన్నప్పుడు వారి ఆరోగ్య సమస్యలు, పీరియడ్ అసమతుల్యత, ఆందోళనలు, డిప్రెషన్ వంటి పరిస్థితులకు దారితీయవచ్చు అని వివరించారు.
చట్టాలపై అవగాహన సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడంతో పాటు విద్యలో ఒక భాగం చేయాలన్న ఆలోచన చేస్తున్నామని.. ఇటీవల విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తో చర్చించినట్లు కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ చెప్పారు.
విజయవంతంగా స్పాట్ లైట్ సెషన్ :
మార్పు ట్రస్ట్ అధినేత ఆర్. సూయజ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ తో ముఖాముఖి నిర్వహించారు. మహిళలపై నేడు జరుగుతున్న అఘాయిత్యాలు, సోషల్ మీడియా వేధికగా వేధింపులు ఇలా పలు అంశాలపై అడిగిన ప్రశ్నలకు రాయపాటి శైలజ విపులంగా సమాధానాలు ఇచ్చారు. విద్యార్థినులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతోపాటు వారిలోని జిజ్ఞాసను ఆమె ప్రశంసించారు. అనంతరం కేబీఎన్ కళాశాల ఉపాధ్యాయ, అధ్యాపక బృందం రాయపాటి శైలజ ను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందజేశారు. కేబీఎన్ కళాశాల నిర్వహించే ఉచిత కుట్టు శిబిరాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్, ఏఓ రమణరావు, గౌతమి, మార్పు ట్రస్ట్ డైరెక్టర్ ఆర్. సూయజ్, తదితరులు పాల్గొన్నారు.