చంద్రబాబు బ్రాహ్మణ ద్వేషి
టీడీపీ ఆత్మీయ సమావేశంపై ఆచారి ఆగ్రహం
గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : తెలుగుదేశం పార్టీ అణువణువులో.. చంద్రబాబు నరనరానా జీర్ణించుకుపోయిన బ్రాహ్మణ ద్వేషం మరోసారి బయటపడిందని బ్రాహ్మణ నాయకుడు, 32వ డివిజన్ కార్పొరేటర్ ఈచంపాటి వెంకటకృష్ణ (ఆచారి) భగ్గుమన్నారు. ఆత్మీయ సమావేశం పేరిట ప్రచురించిన పోస్టర్లో ఒక్క బ్రాహ్మణ నాయకుడి ఫొటో కూడా లేకపోవడమే అందుకు నిదర్శనమని శుక్రవారం బ్రాడీపేటలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా బ్రాహ్మణ వ్యతిరేక ధోరణితోనే ముందుకు సాగిందని ఈచంపాటి మండిపడ్డారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు బ్రాహ్మణ సంక్షేమం కోసం చేసింది శూన్యమని విమర్శించారు. చంద్రబాబు హయాంలో బ్రాహ్మణుల కోసం ప్రవేశపెట్టిన పధకాలన్నీ కేవలం అలంకారప్రాయాలు మాత్రమేనని విమర్శించారు. బ్రాహ్మణులకు టీడీపీలో అసలు ప్రాతినిధ్యమే లేదనీ.. ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ఇచ్చిన పాపాన పోలేదనీ.. ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత నుంచే రాజకీయంగా బ్రాహ్మణులకు కష్టాలు మరింత రెట్టింపయ్యాయని ఆరోపించారు.
వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా పాలనాపగ్గాలు చేపట్టిన నాటి నుంచి బ్రాహ్మణుల సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు వారు చెప్పారు. అందులో భాగంగా తెలుగుదేశం హయాంలో పేరు గొప్ప – ఊరు దిబ్బ అన్న చందంగా మారిన బ్రాహ్మణ కార్పొరేషన్కు 300 కోట్లు కేటాయించి పూర్తి స్థాయిలో బలోపేతం చేసినట్లు తెలిపారు. కోవిడ్ కల్లోల సమయంలో అర్చకులందరికీ తలా 5వేల రూపాయలు కేటాయించి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలకు ప్రత్యేకంగా 234 కోట్లు కేటాయించి ఆలయాలకు పూర్వ వైభవం తెచ్చేందుకు ఆయన కృషి చేసినట్లు చెప్పారు.
ఈ క్రమంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్రెడ్డి ఆలయ, అర్చక వ్యవస్థల మేలు కోసం కృషి చేస్తే... దానికి కొనసాగింపుగా వైయస్ జగన్ తమకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించి తమ సామాజిక వర్గం అభివృద్ధికి విశేషంగా పాటుపడ్డారని తెలిపారు. అంతేకాక పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు అర్చకులకు వంశపారంపర్య హక్కు కల్పించడమే కాక అసలు పదవీ విరమణ అన్న ప్రసక్తే లేకుండా చేసి బ్రాహ్మణుల దశాబ్ధాల కలను సాకారం చేసిన ఏకైక నాయకుడుగా జగన్ను ఆయన కొనియాడారు.
ఇలా తమ జాతి సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ వెన్నంటే బ్రాహ్మణులు నిజాయితీగా నిలబడతారని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో వైయస్ జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావడం తథ్యమని ప్రకటించారు. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీలో ఉన్న విజ్ఞులైన విప్రులంతా నిజానిజాలు పరిశీలించి తెలుగుదేశానికి రాంరాం చెప్పాలని ఈచంపాటి వెంకటకృష్ణ విజ్ఞప్తి చేశారు