సమగ్ర శిక్షాలో అక్రమాలు ఎన్నెన్నో !
భీమవరం ( జర్నలిస్ట్ ఫైల్ ) : జిల్లాలో సమగ్ర శిక్షాలో నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులను ప్రసన్నం చేసుకున్న అనుయాయులకు అడ్డగోలుగా కొలువులు కట్టబెట్టారని.. ఒప్పంద నియామకాల్లోనూ రూ. లక్షలు చేతులు మారాయని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు కొందరు సిద్ధమయ్యారు.
పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో అసిస్టెంట్ ఎడ్యుకేషన్ అధికారితో పాటు మరికొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని మరుగుపరిచి కేవలం అధ్యాపకుడు, సహాయ గణాంకాధికారి కొలువులను మాత్రమే నోటిఫై చేశారు. అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకున్నా పలు కొర్రీలతో పక్కనబెట్టారు. అధ్యాపకుడి పోస్టుకు అర్హతను గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిగా పేర్కొన్నారు. దీనికి ఒక్కరే దరఖాస్తు చేయగా ఆయనకు 52 ఏళ్లని అనర్హుడిగా ప్రకటించారు. డిసెంబరు 2022 నోటిఫికేషన్లో ఏఎంవో, ఎంఐఎస్, ఏఎస్ఓ పోస్టులకు 54 ఏళ్లు పైబడినవారిని ఎంపిక చేసి ఇప్పుడు 52 ఏళ్ల వ్యక్తిని అనర్హుడిగా ప్రకటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సహాయ గణాంకాధికారి కొలువుకు గణితంలో పీజీ ప్రధాన అర్హత. కానీ ఇలాంటి అర్హత ఉన్నవారు లేకపోతే అనే వెసులుబాటుతో ఇతర సబ్జెక్టులు బోధించేవారిని స్టాటిస్టిక్స్ గా మార్చేశారు. వారికి పీజీడీసీఏ ధ్రువీకరణ కూడా లేదు. సమగ్ర శిక్షా కార్యాలయంలో సెక్టోరియల్ అధికారులుగా ఆరుగురికి మాత్రమే అనుమతి ఉంది. కానీ అనధికారికంగా 20 మందికిపైగా పనిచేస్తున్నారు. వీరిలో ఇద్దరు స్కూల్ అసిస్టెంట్లు ఉన్నట్లు సమాచారం. స్కూల్ అసిస్టెంట్లను బోధనేతర విధులకు వినియోగించకూడదనే ముఖ్యకార్యదర్శి ఆదేశాలను బేఖాతరు చేశారు. అసలు పోస్టులు, పని లేకపోయినా కొందరిని కూర్చొబెట్టి వేతనాలు ఇస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
కొన్ని నెలల పాటు సెలవుల్లో ఉన్న అధికారులకు సంబంధించిన కార్లకు బిల్లులు చేసినట్లు అభియోగాలున్నాయి. కనీసం కంప్యూటర్ పరిజ్ఞానం లేకున్నా కీలక పోస్టుల్లో ఉంచడం వెనుక ముడుపుల వ్యవహారమే కారణమనే వాదనలున్నాయి. • కార్యాలయంలో ఓ ఒప్పంద ఉద్యోగి అన్నీ తానై లావాదేవీలు చక్కబెడుతున్నట్లు ఆరోపణలున్నాయి. రాజకీయ అండదండలుండటంతో అతడి జోలికి అధికారులు వెళ్లరని సమాచారం. ఆ ఉద్యోగి విద్యా శాఖాధికారుల పర్యటనల సమయాల్లో కార్లకు ఇంధనం నింపాలంటూ భారీగా సొమ్ము లాగేస్తాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఎన్నికల నిబంధనావళి అమల్లోకి వచ్చాక ఇతరత్రా కార్యక్రమాలకు అవకాశం లేకపోయినా రూ.2.45 లక్షలు డ్రా చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

