ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి
ఓటమి భయంతో అల్లర్ల సృష్టికి కుట్ర
రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కల్పించే చర్యలు
సంయమనం కోల్పోవద్దని పార్టీ శ్రేణులకు ప్రభుత్వ విప్ లేళ్ళ అప్పిరెడ్డి పిలుపు
ఎన్నికల సంఘం స్పందించాలని కోరిన డొక్కా మాణిక్యవరప్రసాద్
జగన్పై జరిగిన దాడిని ఖండిస్తూ గుంటూరులో నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన
ఇది జగన్పై జరిగిన దాడి కాదు.. ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి.. జగన్కు లభిస్తున్న జన నీరాజనం చూసి సహించలేక తెలుగుదేశం దాని తోక పార్టీలు చేసిన దాడి.. అని ప్రభుత్వ విప్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి వ్యాఖ్యానించారు. ఓటమి భయంతో రాష్ట్రంలో ఏదో ఒక విధంగా అలజడి సృష్టించి, శాంతిభద్రతలకు విఘాతం కల్పించాలన్న దురుద్దేశంతో రాజ్యాంగానికి తూట్లు పొడిచే రీతిలో రెచ్చగొడుతున్నారనీ.. సంయమనం కోల్పోకుండా సహనంతో వ్యవహరించాలనీ.. ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ప్రజాస్వామ్యయుతంగా బస్సుయాత్ర చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్పై జరిగిన దాడిని ఖండిస్తూ వైసీపీ శ్రేణులు గుంటూరులో శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి, నల్ల జెండాలతో ఆదివారం బృందావన్ గార్డెన్స్లోని ప్రభుత్వ విప్ లేళ్ళ అప్పిరెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి మొదలైన ఈ ప్రదర్శన లక్ష్మీపురంలో ముగిసింది.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ, దేశమంతటా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకుంటూ.. ఆయన అందించిన రాజ్యాంగ స్పూర్తితో ముందుకు సాగుతామని ప్రతినబూనుతున్న తరుణంలో.. మన రాష్ట్రంలో మాత్రం అంబేద్కర్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. తాజాగా విజయవాడలో జగన్పై జరిగిన దాడిని దానికి పరాకాష్టగా ఆయన ఉదహరించారు.
రాజ్యాంగ బద్దంగా తాను చేసిన కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ.. తాను మంచి చేశానని భావిస్తేనే ఓటేయమని అభ్యర్థిస్తూ బస్సుయాత్ర నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్పై దాడి చేయడమంటే.. అది రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కల్పించే అంశంగానే భావించాల్సి ఉంటుందని లేళ్ళ అప్పిరెడ్డి స్పష్టం చేశారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా దీన్ని ప్రజాస్వామ్య వాదులంతా ముక్త కంఠంతో ఖండిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నిజానికి జగన్కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఓటమి భయంతోనే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారన్న సంగతి ప్రజలందరికీ తెలిసిపోయిందని ఆయన తేల్చి చెప్పారు. ప్రజాబలంతో గెలవలేమన్న వాస్తవాన్ని గ్రహించి ఇలాంటి ఘటనలతో అల్లర్లు సృష్టించడం ద్వారా లబ్ధి పొందాలన్న కుట్రలకు తెరతీశారని ఆయన ఆరోపించారు. ఎన్ని కుయుక్తులు పన్నినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని అడ్డుకోవడం ఎవరి తరమూ కాదన్నారు. ఇకనైనా ఇలాంటి నీచమైన పనులకు స్వస్తి పలకాలని వారికి హితవు పలికారు. లేదంటే తమ తీర్పు ద్వారా తగిన విధంగా బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నట్లు లేళ్ళ అప్పిరెడ్డి హెచ్చరించారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైయస్ జగన్పై దాడి చేయడం ద్వారా రాష్ట్రంలో శాంతియుత ఎన్నికల నిర్వహణను విపక్షాలు ప్రశ్నార్థకంగా మార్చాయని విమర్శించారు. స్వేచ్ఛాయుత ఎన్నికలకు భంగం కలిగించే ఇటువంటి చర్యలపై కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే స్పందించాలని, బాధ్యులను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అప్పుడే రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశించిన విధంగా ప్రజలు ఏ భయమూ లేకుండా స్వచ్ఛందంగా తరలి వచ్చి స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోగలుగుతారని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ నిరసన ర్యాలీలో జీడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు (లాలుపురం రాము), గుంటూరు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బందా రవీంద్రనాథ్, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బత్తుల దేవానంద్, కార్పొరేటర్లు ఈచంపాటి వెంకటకృష్ణ (ఆచారి), షేక్ రోషన్, పడాల సుబ్బారెడ్డి, అంబేద్కర్, బూసి రాజలత, గేదెల రమేష్, బోడపాటి కిషోర్, మోతుకూరి వెంకటరత్నం, గీతా మందిరం ఛైర్మన్ వెలుగూరి రత్నప్రసాద్, నవ్యాంధ్ర యమ్మార్పీయస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావు, పార్టీ నేతలు అంగడి శ్రీనివాసరావు, ఉడతా కృష్ణ, అత్తోట జోసెఫ్, నూనె ఉమామహేశ్వరరెడ్డి, పానుగంటి చైతన్య, ఓర్చు శ్రీనివాసరావు, ఆనం సంజీవరెడ్డి, మాదాసు కిరణ్, ఆలా కిరణ్, కాటూరి విజయ్, మహేంద్ర గులేచ, మిర్చి యార్డు డైరెక్టర్లు కొత్తపల్లి శివసాంబిరెడ్డి, కొత్తపేట సతీష్, షేక్ రబ్బానీ, కౌండిన్య, బైరెడ్డి రవీంద్రారెడ్డి, రెడ్డి కోటేశ్వరరావు, మాదాసు భాగ్యారావు, గనిక జాన్సీ, వెంకాయమ్మ, విజయారెడ్డి తదితరులు పాల్గొన్నారు