నిర్మల ఫార్మసీ కళాశాలలో అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందడి
“వివక్ష నుండి సాధికారత దిశగా – మైండ్సెట్ మార్పు అవసరం” ప్రధాన థీమ్
మంగళగిరి (జర్నలిస్ట్ ఫైల్): నిర్మల ఫార్మసీ కళాశాలలో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) యూనిట్లోని జెండర్ ఈక్వాలిటీ క్లబ్ మరియు వుమెన్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో “చేంజింగ్ మైండ్సెట్స్ ఫ్రమ్ డిస్క్రిమినేషన్ టు ఎంపవర్మెంట్” అనే థీమ్తో శనివారం నిర్వహించారు.
కార్యక్రమానికి ఆరంభంగా విద్యార్థి సమన్వయకర్త ఎ. తనుస్రీ స్వాగతం తెలియజేస్తూ బాలికల హక్కులు, సమాన అవకాశాల ప్రాముఖ్యతను వివరించింది.ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రేవరెండ్ సిస్టర్ జి. నిర్మల జ్యోతి మాట్లాడుతూ — “ప్రతి బాలికకు విద్య, గౌరవం, స్వేచ్ఛ అందే సమాజ నిర్మాణం మన అందరి బాధ్యత. వివక్షను తొలగించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితేనే సత్యమైన సాధికారత సాధ్యమవుతుంది” అని పేర్కొన్నారు. ఆడపిల్లలుగా పుట్టడాన్ని తక్కువగా భావించకుండా ధైర్యంగా లక్ష్యాలతో జీవించాలని విద్యార్థినులకు సూచించారు.
వుమెన్ సెల్ కోఆర్డినేటర్ ఆర్. రత్న మంజుల మాట్లాడుతూ — “బాలికలు కేవలం రేపటి తల్లులు కాదు, ఇవాళ్టి నాయకులు కూడా. విద్యతో పాటు ధైర్యం, నిబద్ధత, నైతికతతో సమాజంలో ఆదర్శంగా నిలవాలి” అని తెలిపారు.
ఈ సందర్భంగా ఎం. భార్గవి ప్రియా అద్భుతమైన ప్రసంగంతో అందరి ప్రశంసలు పొందడంతో శ్రీమతి కొండవీటి నర్మద (గుంటూరు జిల్లా కార్యదర్శి, సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్) ఆమెకు ప్రశంసాపత్రం అందజేశారు.
అదేవిధంగా మాస్టర్ రేఖా నిత్విక్ గౌతమ్ బాలికా దినోత్సవ థీమ్కు అనుగుణంగా చెప్పిన కోట్స్, కవితలు, కబుర్లు అందరి మన్ననలు పొందాయి.
కళాశాల ప్రిన్సిపల్ డా. బి. పాముల రెడ్డి పాల్గొన్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డా. రేఖా నరేష్ బాబు (ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్), ఎస్. స్వాతి (బి.ఫార్మసీ కోఆర్డినేటర్), డా. ఎస్కే. ఫైజాన్ అలీ (ఫార్మకాలజీ విభాగాధిపతి) పాల్గొన్నారు.
కె. నియాజ్ ముస్తఫా, బి. తేజా వివేక్, కె. రాధాకృష్ణ, పి. స్నిగ్ధ వంటి విద్యార్థి సమన్వయకర్తలు సహకారంతో ఫార్మ్.డి మూడో, నాలుగో సంవత్సరం విద్యార్థులు సక్రియంగా పాల్గొన్నారు. ఈ వేడుక బాలికల సాధికారత, సమానత్వం మరియు సామాజిక చైతన్యం అవసరాన్ని ప్రతిబింబించింది.