మంత్రి సీతక్కకు బెదిరింపు లేఖపై మావోయిస్టుల ఖండన
హైదరాబాద్: తెలంగాణ మంత్రి సీతక్కకు బెదిరింపు లేఖ పంపినట్టు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన లేఖను మావోయిస్టులు ఖండించారు. జూలై 5న విడుదల చేసిన అధికారిక ప్రకటనలో సీపీఐ (మావోయిస్ట్) తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జగన్, ఆ లేఖను తమ పార్టీ జారీ చేయలేదని స్పష్టంగా తెలిపారు. జూన్ 26న వెలుగులోకి వచ్చిన ఆ లేఖకు తెలంగాణ రాష్ట్ర కమిటీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇక రాష్ట్ర కార్యదర్శి బాడే చొక్కారావు లొంగిపోయారన్న వార్తల్ని కూడా జగన్ ఖండించారు. అవి తప్పుడు ప్రచారమని, మావోయిస్టులపై నెపం మోపేందుకు చేస్తున్న కుట్రలలో భాగమని అన్నారు. గతంలో మావోయిస్టుల సమస్యను ప్రభుత్వాలు బలవంతంగా అణిచివేసే ప్రయత్నం చేశాయని, అదే విధంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మావోయిస్టులపై ఒత్తిడి ద్వారా పరిష్కారం లభించదని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.
భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఆదివాసీలను పోలీసులు స్టేషన్లకు తీసుకెళ్లి బెదిరిస్తున్నారని, మావోయిస్టు కదలికలు లేనప్పటికీ అనుమానితులుగా భావించి వేదిస్తున్నారని జగన్ ఆరోపించారు. ఆదివాసీలపై పోలీసులు కొనసాగిస్తున్న ఈ అన్యాయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.