సున్నం చెరువులో ఇళ్ల కూల్చివేతలపై హైకోర్టు అసంతృప్తి – చట్ట ప్రక్రియ పాటించాలంటూ హైడ్రాకు ఆదేశం
హైదరాబాద్లోని సున్నం చెరువు సమీపంలో ఇళ్ల కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు మరోసారి హైడ్రా అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాల పేరుతో నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను కూల్చడం సరికాదని, చట్టబద్ధమైన ప్రక్రియను తప్పనిసరిగా పాటించాల్సిందే అని ధర్మాసనం స్పష్టం చేసింది. నీళ్లు వస్తున్నాయన్న కారణంతో నిర్మాణాలను కూల్చివేస్తే, హైదరాబాద్లో ఉన్న అనేక నిర్మాణాలూ నేలమట్టం కావాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది.
సున్నం చెరువు పరిధిలోని బాధితులు హైకోర్టును ఆశ్రయించి, హైడ్రా తమ ఇళ్లను నోటీసులు లేకుండానే కూల్చివేసిందని, అధికారిక సర్వే కూడా చేయలేదని ఆరోపించారు. అకస్మాత్తుగా ఇళ్లు కూల్చడం వల్ల తాము నిరాశ్రయులయ్యామని వారు వాపోయారు. పిటిషనర్లు సమర్పించిన పత్రాలను పరిశీలించిన ధర్మాసనం అవన్నీ చెల్లుబాటయ్యే వే కావని పేర్కొంది.
ఇళ్ల తొలగింపుకు సంబంధించి ఒక స్పష్టమైన చట్ట ప్రక్రియ ఉండాలని, హైడ్రా అధికారులు దానిని ఖచ్చితంగా పాటించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సున్నం చెరువు పరిధిలో ఇంకా కూల్చివేతలు చేపట్టవద్దని హైడ్రాకు ఆదేశాలు జారీ చేసింది. అదనంగా, చెరువు పునరుద్ధరణ పనులకు అనుమతి పొందేందుకు అధికారికంగా దరఖాస్తు చేయాలని హైడ్రాకు సూచించింది. హైడ్రా నిబంధనలను పాటిస్తున్నదా లేదా అన్నది పర్యవేక్షించేందుకు కోర్టు తదుపరి విచారణను జూలై 17కి వాయిదా వేసింది.