పాశమైలారం పేలుడు: మృతుల సంఖ్య 40కి చేరింది
పాశమైలారం: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 40కి చేరింది. శిథిలాల నుంచి అధికారులు తాజాగా మిగిలిన ముగ్గురు కార్మికుల మృతదేహాలను గుర్తించారు. వారిలో ఇద్దరు బీహార్కు చెందినవారు కాగా, మరొకరు ఒడిశాకు చెందిన కార్మికుడిగా గుర్తించారు. ఇప్పటివరకు మొత్తం 36 మృతదేహాలను గుర్తించి, వారి కుటుంబాలకు అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనపై స్పందిస్తూ బీహార్ నేతలు సంఘటన స్థలాన్ని సందర్శించి, బాధిత కుటుంబాలను పరామర్శించారు. పాశమైలారంలో సహాయ కేంద్రం వద్ద బీహార్ ఎంపీ సహా పలువురు నేతలు బాధితులతో మాట్లాడారు. పరిశ్రమ శిథిలాల తొలగింపు ఆరవ రోజు కూడా కొనసాగుతోంది. ఎస్డీఆర్ఎఫ్ మరియు హైడ్రా సిబ్బంది కలిసి భవన శిథిలాలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
అంతేకాదు, ఈ ఘటనలో గాయపడిన మున్మున్ చౌదరి అనే మహిళా కార్మికురాలు ధ్రువ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో సిగాచీ పరిశ్రమ పేలుడులో ఇప్పటివరకు మృతుల సంఖ్య 40కి పెరిగింది. సహాయ బృందాలు మిగిలిన శిథిలాలను తొలగిస్తూ మరిన్ని వివరాలను వెలికితీయాలని యత్నిస్తున్నాయి.