మొంథా తుపాను ముప్పు...
బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది — రానున్న సోమవారం నాటికి తుపానుగా మారే అవకాశం
కాకినాడ సమీపంలో 28వ తేదీ సాయంత్రం తీరం దాటే సూచనలు
అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దూసుకువస్తున్న “మొంథా” తుపానుగా మారే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం సీనియర్ డ్యూటీ ఆఫీసర్ జగన్నాథ్ కుమార్ తెలిపారు. రానున్న సోమవారం నాటికి ఈ అల్పపీడనం తీవ్రవాయుగుండంగా మారి, ఆపై తుపానుగా బలపడుతుందని చెప్పారు.
తీరం వైపు దూసుకొస్తున్న “మొంథా”
ఈ తుపాను 28వ తేదీ సాయంత్రం తరువాత కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణా సంస్థ ప్రకటించింది. ఆ సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
పలు జిల్లాల్లో వర్షాల బీభత్సం
అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే ఎపిలోని తీర, ఉత్తర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు మరో నాలుగు నుండి ఐదు రోజుల వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ”అల్పపీడనం పశ్చిమ, వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతోంది. 27వ తేదీ నాటికి ఇది తీవ్రవాయుగుండంగా మారి, బంగాళాఖాతంలోని నైరుతి, పశ్చిమ మధ్య ప్రాంతాల్లో తుపానుగా మారుతుంది” అని జగన్నాథ్ కుమార్ వివరించారు.
మత్స్యకారులు జాగ్రత్త!
తీరప్రాంతంలో గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. బోట్లను తీరానికి తీసుకువచ్చి లంగరు వేసి ఉంచాలని సూచించారు.
రైతులకు సూచనలు
వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, పంటలను వర్షాల ప్రభావం నుంచి రక్షించే చర్యలు ముందుగానే చేపట్టాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప ఇళ్లనుంచి బయటకు రాకూడదని సూచించారు.
జాగ్రత్తలు పాటించండి
మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద, హోర్డింగ్లు ఉన్న ప్రదేశాల్లో నిలవకూడదని హెచ్చరించారు. ఎలక్ట్రానిక్ పరికరాలను ప్లగ్లో ఉంచకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ప్రభుత్వ యంత్రాంగం సిద్దంగా ఉండాలి
తీరప్రాంత ప్రజలకు ముందస్తు హెచ్చరికలు అందిస్తూ, రక్షణ చర్యలకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని విపత్తుల నిర్వహణా సంస్థ సూచించింది.

