రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి
రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి
-నల్లపల్లి విజయ్ భాస్కర్ , రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ద్వారా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 11 సంవత్సరాలు కావస్తున్న అమరావతిలో పనిచేస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగస్తులకు ఇప్పటివరకు ఇళ్ల స్థలాలు కేటాయించకపోవడం సరైనది కాదని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ భాస్కర్ విమర్శించారు. ఈ సందర్భంగా నల్లపల్లి విజయభాస్కర్ మాట్లాడుతూ 13-02-2019 న రాష్ట్ర ప్రభుత్వం అమరావతి లో పనిచేసే ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని జీవో నెంబర్ 66 ఇవ్వడం జరిగిందని, ఈ ఉత్తర్వుల మేరకు రాష్ట్ర సచివాలయంలో పనిచేసే గెజిటెడ్ ఉద్యోగులు మరియు విభాగాల అధిపతులకు చదరపు గజం 4500 రూపాయలతో 200 చదరపు గజాలు, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు మరియు వివిధ శాఖల ఉన్నతాధికారులకు చదరపు గజం 4000 రూపాయలతో 170 చదరపు గజాల ఇంటి స్థలాలు మంజూరు చేయాల్సి ఉందన్నారు. కానీ 2019 నుండి 2025 వరకు ఈ ప్రభుత్వ ఉత్తర్వులు అమలు కాకపోవడం శోచనీయం అన్నారు. గత ప్రభుత్వంలో రాజధాని విషయంలో ఏర్పడిన సందిగ్ధం దృష్ట్యా ఉద్యోగులు అమరావతిలో ఇళ్ల స్థలాలు అడగలేకపోయారని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అమరావతిని ప్రతిష్టాత్మకంగా నిర్మించాలనే దృఢ సంకల్పంతో ఉన్న ఈ తరుణం లో ఉద్యోగుల కు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే మరింత ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఆమోద యోగ్యమైన ధరలకు ఇంటి స్థలాలు కేటాయిస్తే రాష్ట్ర ఖజానా కు అధిక మొత్తంలో ఆదాయం లభిస్తుందని, రాజధాని ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మరియు మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన కు ఆస్కారం ఉంటుందని అన్నారు. అంతేగాకుండా హైదరాబాద్ నుండి రాకపోకలు తగ్గి తమ పని పై ఎక్కువ సమయాన్ని వెచ్చించడం జరుగుతుందని అన్నారు. ఉద్యోగులు రాజధాని అభివృద్ధి పనులలో ప్రత్యక్షంగా పాల్గొనడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు త్వరిత గతిన పూర్తికావడం జరుగుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు ఉద్యోగులు ఉన్న ఫలంగా హైదరాబాద్ లోని తమ శాశ్వత నివాసాలను, కుటుంబాలను వదిలి రాష్ట్ర అభివృద్ధి కోసం వచ్చారని అటువంటి ఉద్యోగుల కు శాశ్వత ఇంటి స్థలాలు ఇచ్చి గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని అన్నారు.

