గుంటూరులో 60 లక్షల విలువైన సెల్ఫోన్లు రికవరీ
ఇప్పటి వరకు జిల్లాలో రూ. 5.8 కోట్ల విలువైన 2,900 ఫోన్లను రికవరీ
గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : జిల్లాలో సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. సెల్ఫోన్ల ద్వారా జరిగే మోసాలపై అవగాహన కలిగించడమే లక్ష్యంగా శుక్రవారం పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దొంగిలించబడ్డ మరియు పోగొట్టుకున్న 300 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. వీటి విలువ సుమారు రూ. 60 లక్షలుగా ఉంది. ఇప్పటి వరకు జిల్లాలో రూ. 5.8 కోట్ల విలువైన 2,900 ఫోన్లను రికవరీ చేసినట్టు తెలిపారు.
ఫోన్ పోయిన వెంటనే 1930 నంబరుకు లేదా సీఈఐఆర్ వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. నేటి రోజుల్లో మొబైల్ఫోన్లు వ్యక్తిగత, బ్యాంకు, గోప్యమైన సమాచారాన్ని కలిగి ఉండటంతో అవి తప్పిపోయినప్పుడు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎటువంటి రుసుము లేకుండా మొబైళ్లను తిరిగి పొందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సైబర్ నేరగాళ్లు తరచుగా అధిక వడ్డీ, ఉద్యోగం, వ్యాపారం పేరుతో మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద ఫోన్ కాల్స్ వస్తే వాటిని బ్లాక్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
ప్రయాణాల సందర్భంలో ప్రజలు ఎల్.హెచ్.ఎం.ఎస్ సేవను వినియోగించుకోవాలని, ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనాలకు వీల్ లాక్లు, GPS ట్రాకింగ్ వ్యవస్థలు అమర్చుకోవాలని సూచిస్తూ వాహన దొంగతనాలు ఎదుర్కొనే అవకాశం తగ్గుతుందని తెలిపారు.
ఫోన్ల రికవరీలో కృషి చేసిన ఐటీ కోర్ సీఐ నిస్సార్ బాషా, హెడ్ కానిస్టేబుల్ కిషోర్, కానిస్టేబుళ్లు శ్రీధర్, మానస, సీసీఏఎస్ హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ కరీముల్లాను ఈ సందర్భంగా అభినందించారు.కార్యక్రమంలో అదనపు ఎస్పీ హనుమంతు, ఎస్బీ సీఐ శ్రీనివాస్, ఐటీ కోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.