'ఏపీ ఎన్జీజీవో' పై ప్రత్యేక అభిమానం... పరస్పర సహకారంతో పనిచేద్దాం : ముఖ్యమంత్రి చంద్రబాబు
రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగులు భాగస్వాములు కావాలి
ఉద్యోగుల సమస్యలపై పూర్తి స్పష్టత ఉంది... ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం
కొత్త ఏడాదిలో నూతనుత్తేజంతో పనిచేద్దాం
ఏపీ ఎన్జీజీవో నేతలతో, ఏపీ జేఏసీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అమరావతి(జర్నలిస్ట్ ఫైల్) : కొత్త ఏడాదిలో మరింత నూతనుత్తేజంతో, సమష్టి భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర సాధన దిశగా పనిచేద్దామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రాభివృద్ధిలో ప్రభుత్వ ఉద్యోగులు కీలక భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. సోమవారం ఏపీ ఎన్జీజీవో, ఏపీ జేఏసీ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏపీ ఎన్జీజీవో, ఏపీ జేఏసీ నేతలు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీజీవో సంఘం డైరీ, క్యాలెండర్–2026ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు.
ఉద్యోగుల సమస్యలపై పూర్తి అవగాహనతో పాటు స్పష్టమైన దృష్టి ఉందని, దశలవారీగా అన్ని అంశాలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తూనే ఉద్యోగుల హక్కులను కాపాడే దిశగా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర రాష్ట్రాభివృద్ధిలో కీలకమని అన్నారు. ప్రభుత్వ ప్రణాళికాయుత ప్రయత్నాలకు ఉద్యోగ సంఘాల సహకారం జతచేస్తే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చని పేర్కొన్నారు.
ఏపీ ఎన్జీజీవో అధ్యక్షుడు ఏ. విద్యాసాగర్ మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధిలో ఎన్జీజీవోస్, ఏపీ జేఏసీ కీలక భాగస్వాములుగా నిలుస్తాయని అన్నారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రం వేగవంతమైన అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఉద్యోగుల సమస్యలు, ఆకాంక్షలు కొత్త సంవత్సరంలో నెరవేరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు సంబంధించిన పలు ముఖ్య అంశాలను ఏపీ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
రాజధానిలో ఇళ్ల స్థలాల అంశం
హెచ్.ఓ.డిల, సెక్రటేరియట్ ఉద్యోగులకు రాజధానిలో ఇళ్ల స్థలాల కేటాయింపు అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చినట్లు ఏపీ ఎన్జీజీవో నేతలు ఏ. విద్యాసాగర్, డీవీ రమణ తెలిపారు.
మహిళా ఉద్యోగుల ధన్యవాదాలు
ఉద్యోగ సంఘాల సమావేశంలో ఇచ్చిన హామీ మేరకు మహిళా ఉద్యోగుల చైల్డ్ కేర్ లీవుకు సంబంధించి వయోపరిమితిని తొలగించినందుకు ఏపీ ఎన్జీజీవో మహిళా నేతలు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. రెండు లక్షల మంది మహిళా ఉద్యోగుల తరఫున రాజ్యలక్ష్మి, జానకి, సురేఖ తదితరులు జ్ఞాపికను అందజేశారు.
ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు
ఆర్టీసీ ఉద్యోగుల ప్రమోషన్లపై ఇచ్చిన హామీని అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా ఏపీ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్, ఏపీఎస్ఆర్టీసీ ఎన్.ఎం.యు నేతలు వై. శ్రీనివాస్, రాజు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
పెన్షనర్ల వినతులు
ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్ల సంఘం నాయకులు బీ. వెంకటేశ్వర్లు, ప్రభుదాసు ముఖ్యమంత్రిని కలిసి పెన్షనర్ల ఎడిషనల్ క్వాంటం అంశాన్ని ప్రస్తావించారు. 2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఎడిషనల్ క్వాంటంను గత ప్రభుత్వం కోత విధించిందని, దానిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని కోరారు.
డైరీలు, క్యాలెండర్ల ఆవిష్కరణ
ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ ఉపాధ్యాయ సంఘాలు, ఏపీపీటీడీ ఎన్.ఎం.యు సంఘం, పెన్షనర్స్ సంఘం డైరీలు, క్యాలెండర్లను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
సమావేశంలో ఏపీ ఎన్జీజీవో జనరల్ సెక్రటరీ డీవీ రమణ, ఏపీ యూటీఎఫ్ అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు, ఏపీ ఎస్టీయూ అధ్యక్షుడు ఎం. రఘునాథరెడ్డి, ఏపీ టీచర్స్ ఫెడరేషన్ (257) అధ్యక్షుడు జి. హృదయరాజు, ఏపీ టీచర్స్ ఫెడరేషన్ (1938) అధ్యక్షుడు సీహెచ్. మంజుల, ఏపీపీటీడీ ఎన్.ఎం.యు అధ్యక్షుడు వై. శ్రీనివాస్, ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డి. వెంకటేశ్వర్లు, ఏపీ సీపీఎస్ అధ్యక్షుడు కె. సతీష్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం అధ్యక్షుడు జానీ పాషా, ఏపీపీఏవో అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.ఎస్. హరణాథ్, ఏపీ ఇరిగేషన్ ఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్. శ్రీనివాసరావు, ఏపీ క్లాస్–4 అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్. చంద్రశేఖర్, ఏపీ వెటర్నరీ ఫెడరేషన్ బి. సేవా నాయక్, ఏపీ ఏఈవోఎస్ అధ్యక్షుడు వేణుమాధవ్, ఏపీ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. శ్రీనివాస్, ఏపీఆర్ఎస్వో అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

.jpeg)

