గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కరించాలి.
సీసీఎల్ఏ కార్యాలయం ఎదుట వీఆర్ఏల మహా ధర్నా
మంగళగిరి (జర్నలిస్ట్ ఫైల్) : గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలనిఏపీ వీఆర్ఏ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం బాల కాశి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నగరంలోని ఆటోనగర్ సిసిఎల్ఏ కార్యాలయం వద్ద ఏపీ వీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. గ్రామ రెవిన్యూ సహాయకుల ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఏపీ వీఆర్ఏ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం బాల కాశి మాట్లాడుతూ.... రాష్ట్రంలో ని ఉమ్మడి 13 జిల్లాల్లో సుమారు 20వేల మంది గ్రామ రెవెన్యూ సహాయకులు గ్రామ రెవెన్యూ వ్యవస్థలో పనిచేస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నారని తెలిపారు. గ్రామ రెవెన్యూ సహాయకులకు 2018లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో రూ.10,500 వేతనం పెరిగిందని, ఆనాటి నుంచి నేటి వరకు ఒక్క రూపాయి కూడా పెరగలేదని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో వీఆర్ఏలు తీవ్ర నిర్లక్ష్యానికి గురి అయ్యారని, చాలీచాలని వేతనాలతో పనిచేయాల్సి రావటంతో వారిలో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మార్లు వినతి పత్రాలు ఇచ్చినా సమస్యలపై సానుకూల స్పందన రాలేదన్నారు. ఈ నేపథ్యంలో అనివార్యంగా ధర్నా చేపట్టామని తెలిపారు. తెలంగాణ తరహాలో పేస్కేల్ అమలు చేయాలని, నామినల్ వీఆర్ఏల నియామకం, కారుణ్య నియామకాలు, అర్హులందరికీ ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏల సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు సిద్ధమని హెచ్చరించారు. గ్రామ రెవెన్యూ సహాయకుల ఎదుర్కొంటున్న పలు సమస్యలు వారి ప్రధాన డిమాండ్లకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించామని సీసీఎల్ఏ అధికారులు స్పష్టం చేశారు. వీఆర్ఏల సేవా భద్రత వేతనాలు విధి నిర్వహణకు సంబంధించిన అంశాలతో పాటు ఇతర పెండింగ్ సమస్యలను సమగ్రంగా వివరించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిపారు. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుని అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తామని సంబంధిత అధికారులు తెలియజేసినట్లు సిసిఎల్ఏ కార్యాలయం అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏపీ వీఆర్ఏ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఎన్ పెద్దన్న , వైస్ చైర్మన్ లు టి అంజి ఎన్, నాగేశం, మర్రి వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, ఏఐటియుసి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెలుగూరి రాధాకృష్ణమూర్తి, జిల్లా అధ్యక్షులు ఆకిటి అరుణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి మేడ హనుమంతరావు, సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి యార్లగడ్డ వెంకటేశ్వరరావు, మండల కార్యదర్శి జాలాది జాన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

