స్వర్ణాంధ్ర సాధన లో నూతన జాతీయ విద్యా విధానం ప్రముఖ పాత్ర
ఏబీఆర్ఎస్ఎం జాతీయ కార్యదర్శి గుంత లక్ష్మణ్ జీ
మంగళగిరి (జర్నలిస్ట్ ఫైల్): వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర సాధన లో నూతన జాతీయ విద్యా విధానం ప్రముఖ పాత్ర పోషిస్తుందని భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఘ్ (ఏబీఆర్ఎస్ఎం) జాతీయ కార్యదర్శి గుంత లక్ష్మణ్ జీ అన్నారు. తాడేపల్లి కేఎల్ విశ్వవిద్యాలయంలో అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఘ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత అభ్యాస వర్గ (స్టేట్ ఫ్యాకల్టీ ట్రైనింగ్)కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం జాతీయ విద్యా విధానం - 2020 తీసుకువచ్చిందన్నారు. ఉద్యోగాలను సృష్టించి దేశంలో పేదరికాన్ని నిర్మూలించడం లక్ష్యంగా పని చేస్తుందన్నారు.
అయిదేళ్లలోనే నూతన విద్యా విధానం సత్ఫలితాలు ఇస్తుందని, రాబోయ్ రోజుల్లో మరిన్ని చూడబోతున్నామని అన్నారు. దేశ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు ,విలువలు, మానవీయత ఆధారంగా విద్యా విధానం ముందుకు వెళ్లాలని తద్వారా భారత్ విశ్వ గురువుగా నిలుస్తుందని పేర్కొన్నారు. భారతీయ విద్యా వ్యవస్థను ఆధునీకరించడంలో ప్రాచీన భారతీయ విజ్ఞాన వ్యవస్థ, భారతీయ వారసత్వాన్ని గుర్తించాలన్నారు. ఈ విధానంపై ఎప్పటికప్పుడు వర్క్ షాపు ల ద్వారా అధ్యాపకులకు అప్డేట్ లు అందిస్తున్నామన్నారు. ఏబీఆర్ఎస్ఎం దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అగ్రగామి ఉపాధ్యాయ సంస్థ అని, భారతదేశంలో ప్రాథమిక దశ నుండి ఉన్నత విద్యా సంస్థల వరకు 15 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని తెలిపారు.
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, వీవీ లక్ష్మీ నారాయణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ కే మధుమూర్తి , ప్రొఫెసర్ రాజశేఖర్ రావు, ప్రో ఛాన్సలర్, కేఎల్ విశ్వవిద్యాలయం , రామకృష్ణ మిషన్, విజయవాడకు చెందిన సీతాకాంత్, విజయవాడకు చెందిన ఆర్ఎస్ఎస్ ప్రముఖులు ఈ రెండు రోజుల వర్క్ షాపు లో నూతన జాతీయ విద్యా విధానం అందిస్తున్న చక్కని ఫలితాలను విస్తృతంగా విశ్లేషించారు.
అధ్యాపకుల సమస్యల వెంటనే పరిష్కరించండి
కేఎల్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఘ్ ప్రాంత అభ్యాస్ వర్గలో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ, ఇంజనీరింగ్ మరియు ఇంటర్మీడియట్ కళాశాలల నుండి అధ్యాపకులు పాల్గొని ఆంధ్రప్రదేశ్ లోని ఉన్నత విద్యా రంగంలో పనిచేస్తున్న అధ్యాపకుల సమస్యల పైన చర్చించి ప్రాంత అభ్యాస్ వర్గ కు ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె .మధు మూర్తి కి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. విశ్వవిద్యాలయాల, డిగ్రీ కళాశాలలు, ఉన్నత విద్యా సంస్థలలో అధ్యాపకులను వెంటనే నియమించడం, అధ్యాపకుల పదోన్నతుల కోసం కెరీర్ అడ్వాన్స్ స్కీమ్ నిర్వహించేలా విశ్వవిద్యాలయాలను ఆదేశించడం, వివిధ విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న అకడమిక్ కన్సల్టెంట్ల కు జీతాలు ఇవ్వడానికి జీవో నెంబర్ 110 అమలు, ఇంజనీరింగ్ అడ్మిషన్లకు ముందే డిగ్రీ కళాశాల ప్రవేశాలు నిర్వహించడం, నూతన జాతీయ విద్యా విధానములో కొత్త పాఠ్యాంశాలను రూపొందించడంలో ఉపాధ్యాయులను భాగస్వామ్యం చేయడం, ప్రతి నెల 1 వ తేదీన జీతాలు విడుదల చేయడానికి సరైన చర్యలు తీసుకోవడం, మంచి మౌలిక సదుపాయాలు, భవనాలను పొందడానికి కొత్తగా స్థాపించబడిన విశ్వవిద్యాలయాలకు ప్రత్యేక నిధులను విడుదల చేయడం, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న విశ్వవిద్యాలయాలకు శాశ్వత వైస్ ఛాన్సలర్ల ను నియమించడం వంటి సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ప్రభుత్వంతో చర్చించి తర్వాత సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ వై.వి. రామిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ డి ఎస్ వి ఎస్ బాలసుబ్రహ్మణ్యం, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి రాజశేఖర్, డాక్టర్ కాశి బాబు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,డిగ్రీ కళాశాలల విభాగం, ప్రొఫెసర్ ముప్పాల లక్ష్మణ్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఇంజనీరింగ్ కళాశాలల విభాగం శరత్, రాష్ట్ర అధ్యక్షుడు ఇంటర్మీడియట్ విభాగం డాక్టర్ ఎం వి నర్సయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఇంటర్మీడియట్ విభాగం వివిధ విశ్వవిద్యాలయాల డిగ్రీ, ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ కళాశాలల్లో పనిచేస్తున్న దాదాపు 200 మంది అధ్యాపకులు ఏ బి ఆర్ ఎస్ ఎం ప్రాంత అభ్యాస వర్గలో పాల్గొన్నారు.

