మంత్రివర్గ ఉపసంఘ ఏర్పాటుపై గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక హర్షం
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం 10 మంది మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం ను ఏర్పాటు చేయడం పట్ల గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక హర్షం వ్యక్తం చేసింది.
ఐక్యవేదిక రాష్ట్ర ఛైర్మన్ ఎం.డి. జాని పాషా, రాష్ట్ర సెక్రటరీ జనరల్ విప్పర్తి నిఖిల్ కృష్ణ, రాష్ట్ర కన్వీనర్ షేక్ అబ్దుల్ రజాక్ సంయుక్తంగా ప్రకటన విడుదల చేస్తూ, చీఫ్ సెక్రటరీ ద్వారా జి.ఒ.ఆర్.టి. నెం:1859 విడుదలైందని, ఇది ఉద్యోగుల న్యాయపోరాటానికి గొప్ప విజయమని తెలిపారు.
పదోన్నతులను ఇతర శాఖలతో విలీనం చేయాలన్న మా డిమాండ్ ఫలించింది
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతులను ఇతర ప్రభుత్వ శాఖల పదోన్నతులతో విలీనం చేయాలని ఐక్యవేదిక తరపున నిరంతరం కృషి చేశామని, ప్రభుత్వం ఆ దిశగా ముందడుగు వేసిందని జాని పాషా వెల్లడించారు.
లక్షా ఇరవై వేల ఉద్యోగుల ఆకాంక్ష
మంత్రివర్గ ఉపసంఘం త్వరితగతిన చర్యలు తీసుకుని, నిర్ధిష్ట గడువులోపే గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి, అన్ని శాఖల్లో సమానత్వం నెలకొనేలా చర్యలు తీసుకోవాలని ఐక్యవేదిక డిమాండ్ చేసింది. అదేవిధంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలని కోరింది.
ఉద్యోగులకు న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగుతుంది
మంత్రివర్గ ఉపసంఘ నిర్ణయం మొదటి అడుగే తప్ప అంతిమ పరిష్కారం కాదని, ప్రభుత్వం నిబద్ధతతో ముందుకు సాగితే లక్షలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపవచ్చని ఐక్యవేదిక నాయకులు స్పష్టం చేశారు.