హైదరాబాద్ ( జర్నలిస్ట్ ఫైల్ ) : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మరోసారి మండిపడ్డారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని పూజిత అపార్ట్మెంట్కు హైడ్రా నోటీసులు జారీ చేసిన విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత నివాసితులను పరామర్శించేందుకు అక్కడికి వెళ్లిన ఈటల, మీడియాతో మాట్లాడుతూ... ‘‘ఈ ప్రభుత్వానికి తలతోకలేదని, ఎక్కువ రోజులు రేవంత్ సర్కార్ కొనసాగదు. ఇది తుగ్లక్ ప్రభుత్వం. సీఎం రేవంత్ ఒక శాడిస్ట్, సైకో. ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నార’’ని విమర్శలు గుప్పించారు.
కూల్చివేతలపై ఘాటుగా
ప్రభుత్వం ప్రజల ఇళ్లను కూల్చివేస్తూ వారిని వేదిస్తున్నదని పేర్కొన్నారు. ‘‘ఇళ్లు కడతామని అనుమతులు ఇచ్చిన అధికారులు ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు? ఎమ్మార్వో నోటీసులు ఇస్తే కలెక్టర్కి తెలియదంటే నమ్మాలా? అసలు అనుమతులు ఇచ్చేటప్పుడు అధికారుల బుద్ధి ఏందీ?’’ అంటూ ప్రశ్నలు వర్షించారు. ప్రజలు కూల్చే ప్రభుత్వాన్ని చూసేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
ఇంటెలిజెన్స్ ఉందా? లేకపోయిందా?
రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నా.. గ్రౌండ్ రియాలిటీ సీఎం రేవంత్కు తెలియదని ఎద్దేవా చేశారు. తన వెనుక ఏమి జరుగుతున్నదో ఆయనకే తెలియకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఇప్పుడు అయినా వ్యవస్థను సరిదిద్దుకోవాలని హితవు పలికారు. ప్రజల బాధలను నిర్లక్ష్యం చేసిన పాలకులు ఎప్పటికీ నిలబడలేరని స్పష్టం చేశారు. ఇది కొత్త వ్యవహారం కాదని, ఇప్పటికే అనేకసార్లు సీఎం రేవంత్పై తీవ్ర విమర్శలు చేసిన విషయాన్ని ఈటల గుర్తు చేశారు. ‘‘రేవంత్ రెడ్డి ఒక జోకర్. పరిపాలన అనేది ఆయన్ను చూసి పరారైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో మునిగిపోయింది. పాలన చేతకాక ప్రజలను మోసం చేస్తున్నారు’’ అని ఈటల గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు.