సీఎం గారూ.. వెటరన్ జర్నలిస్టుల పట్ల కరుణ చూపండి: సీనియర్ జర్నలిస్ట్ బాబు బహదూర్ వినతి
పెన్షన్ సదుపాయం కల్పించి... జర్నలిస్టు జీవితానికి భరోసా ఇవ్వండి
అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : వెటరన్ జర్నలిస్టులు... జీవితాంతం ప్రజల సమస్యలకూ, ప్రభుత్వ పాలనకూ మధ్య వారధిలా నిలిచి సేవలు అందించిన వారు. అలాంటి కలం యోధులు తమ జీవిత చివరి దశలో ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదని కోరుతూ సీనియర్ జర్నలిస్టు బాబు బహదూర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఓ వినతి చేశారు.
"వృద్ధాప్యం, పేదరికం వెటరన్ జర్నలిస్టులను వెంటాడుతున్నాయి. ప్రభుత్వం అందించే సీనియర్ సిటిజన్ కార్డుతో ఆరోగ్య పరిరక్షణ అందుబాటులో ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు మాత్రం అసహనానికి గురిచేస్తున్నాయి," అని పేర్కొంటూ... వీరికి ప్రత్యేకంగా మంత్రుల కమిటీ వేసి, అవసరాలను అధ్యయనం చేసి, అర్హులైన వారికి నెలవారీ పెన్షన్ మంజూరు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.
బాబు బహదూర్ వివరించిన ప్రకారం...
– గత ఏడాదిన్నరుగా వెటరన్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ సదుపాయం కల్పించబడినా,
– పెన్షన్ లాంటి ఆర్థిక భరోసా లేకపోవడంతో వారు గడవడం కష్టమవుతోందని తెలిపారు.
– తమిళనాడు, హర్యానా, అస్సాం వంటి రాష్ట్రాలు ఇప్పటికే జర్నలిస్టులకు పెన్షన్ ఇస్తున్నాయని గుర్తు చేశారు.
ఏపీలో వెటరన్ జర్నలిస్టుల సంఖ్య:
ప్రాంతీయ స్థాయిలో చూస్తే, రాష్ట్రవ్యాప్తంగా 5 వేల నుంచి 6 వేలమంది వరకూ వెటరన్ జర్నలిస్టులు ఉండవచ్చని అంచనా. ప్రస్తుతం 60 ఏళ్లు దాటిన వృద్ధులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4వేల పింఛను ఇస్తోంది. వీరిలో జర్నలిస్టులు ఎంతమంది లబ్ధిదారులుగా ఉన్నారన్న వివరాలు మాత్రం స్పష్టంగా లేవు.
ప్రత్యేక పథకం ఆవశ్యకం:
సొంత ఇల్లు లేని, స్థిర ఆదాయం లేని అనేకమంది వెటరన్ విలేకరులు ఇప్పటికీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో జీవితం కొనసాగిస్తున్నారని బాబు బహదూర్ అన్నారు. "కేవలం కలమే ఆయుధంగా కలిగి, జీతాలు లేని వ్యవస్థలో బాధ్యతతో పని చేసిన వారికి ప్రభుత్వం ఇప్పుడు భరోసా ఇవ్వాలి" అని ఆయన వేడుకున్నారు.“చివరి శ్వాసవరకూ ప్రజల కోసం పోరాడిన వారిని మర్చిపోవద్దు” అని కోరుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశంపై ఆలోచించాలని ఆయన విన్నవించారు.
