నేపాల్లో హింసాత్మక ఆందోళనలు: 20 మంది మృతి, వందలాది గాయాలు
ఖాట్మండూ: నేపాల్లో సోషల్ మీడియా నిషేధంపై రాజధాని ఖాట్మండూ Monday ఉద్రిక్తంగా మారింది. కేపీ శర్మ ఓలీ ప్రభుత్వంపై యువత భారీ ఎత్తున నిరసనకు దిగగా.. ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఇప్పటివరకు 20 మంది ప్రాణాలు కోల్పోగా, 200 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనల నేపథ్యంలో హోంమంత్రి లేఖక్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు.
తీవ్ర ఘర్షణలు – కాల్పులు
పార్లమెంట్ వద్ద భారీ ఎత్తున బారికేడ్లు దాటి లోనికి చొరబడే ప్రయత్నం చేసిన ఆందోళనకారులపై పోలీసులు బలప్రయోగం చేశారు. ఘర్షణలు పెరగడంతో కాల్పులు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేలాది మంది యువతతో ఖాట్మండూ వీధులు జనసముద్రంగా మారాయి. నిషేధిత జోన్లను కూడా నిరసనకారులు లెక్క చేయకపోవడంతో పరిస్థితి అదుపు తప్పింది.
కర్ఫ్యూ, నిషేధాజ్ఞలు
హింసాత్మక సంఘటనల కారణంగా రాజధానిలో పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సమావేశాలు, నిరసనలు, గుమికూడడాలు నిషేధించనున్నట్లు అధికారులు ప్రకటించారు. పార్లమెంట్, రాష్ట్రపతి భవన్, ప్రధాని కార్యాలయం వంటి కీలక ప్రాంతాలను సీల్చేశారు.
సోషల్ మీడియా నిషేధమే కారణం
నేపాల్ ప్రభుత్వం గత వారం 26 సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించింది. రిజిస్ట్రేషన్ గడువు తీరినా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్), వాట్సాప్, లింక్డ్ఇన్, రెడిట్ తదితర ప్లాట్ఫారాలు రిజిస్టర్ కానందున వాటిపై ఆంక్షలు అమలుచేశారు. అయితే, టిక్టాక్, వైబర్, పోపో లైవ్ వంటి కొన్ని యాప్లు మాత్రం అనుమతులు పొందాయి. ఈ నిర్ణయాన్ని ప్రజలు భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడిగా ఖండిస్తున్నారు.
ఓలీ ప్రభుత్వంపై విమర్శలు
“ప్రభుత్వ నిర్ణయం డిజిటల్ నేపాల్కు ముప్పు” అని కంప్యూటర్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్ విమర్శించింది. పత్రికా స్వేచ్ఛ, సమాచార హక్కును కించపరిచే చర్య అని జర్నలిస్టుల సమాఖ్య మండిపడింది. మరోవైపు, ప్రతిపక్షం 20 మంది ప్రాణాలు తీసిన ఈ హింసకు కారణమైన కేపీ శర్మ ఓలీ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేసింది.