బకాయిల విడుదలపై సెక్రటేరియట్ సీపీఎస్ ఉద్యోగుల సంఘం హర్షం
సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో ఉద్యోగుల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్): 2018 జూలై నుండి పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలను ఆంధ్రప్రదేశ్ సచివాలయ సీపీఎస్ ఉద్యోగులకు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్లకు ఏపీ సెక్రటేరియట్ సీపీఎస్ అసోసియేషన్ తరపున అధ్యక్షుడు కోట్ల రాజేష్, ఉపాధ్యక్షుడు నాపా ప్రసాద్, కార్యదర్శి అంబటి వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో సీపీఎస్ ఉద్యోగుల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతున్నాయని వారు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రెండు సంవత్సరాలుగా చెల్లించక బకాయిగా పెట్టిన నెలవారీ జీతంతో పాటు జమ కావాల్సిన సీపీఎస్ కాంట్రిబ్యూషన్ను, ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే చెల్లించిందని గుర్తు చేశారు.
అలాగే, సీపీఎస్ ఉద్యోగులను సంవత్సరాలుగా వేధించిన మిస్సింగ్ క్రెడిట్స్ సమస్యను పరిష్కరించి, దాదాపు రూ.250 కోట్ల నిధులు విడుదల చేయడానికి ఇటీవలే ఆదేశాలు జారీ అయినట్లు తెలిపారు.తొందరలోనే సీపీఎస్ రద్దు అంశం కూడా ఈ ప్రభుత్వ హయాంలోనే పరిష్కారం కానుందనే ఆశాభావాన్ని అసోసియేషన్ వ్యక్తం చేసింది.