ఉపాధ్యాయులు విలువలతో కూడిన విద్య బోధించాలి
మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ఏ.ఎస్. రామకృష్ణ
గుంటూరు,(జర్నలిస్ట్ ఫైల్) : ఉపాధ్యాయులు కేవలం పాఠ్యపుస్తక జ్ఞానాన్ని మాత్రమే కాకుండా విలువలతో కూడిన విద్యను కూడా బోధించాలని మాజీ శాసన మండలి సభ్యుడు డాక్టర్ ఏ.ఎస్. రామకృష్ణ అన్నారు.
పట్టాభిపురం మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు గుమ్మడి సుశీల మాధవి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా పురస్కారం పొందిన సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వై. వీరబాబు అధ్యక్షతన జరిగిన అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ రామకృష్ణ, సుశీల మాధవి తన వృత్తిపట్ల అంకితభావంతో పనిచేశారని, అనేక మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించి చదివించారని, క్రీడలలో పాల్గొని పతకాలు సాధించారని తెలిపారు. రాష్ట్ర స్థాయి అవార్డుకు ఆమె పూర్తి అర్హురాలని ఆయన అభినందించారు.
నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొనిగల హైమారావు మాట్లాడుతూ సుశీల మాధవి 25 ఏళ్ల సేవలో వ్యాయామ ఉపాధ్యాయురాలిగా విశిష్ట గుర్తింపు పొందారని, ఎన్సీసీ ఆఫీసర్గా అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్దారని తెలిపారు. ఎన్సీసీ శిక్షణ పొందిన విద్యార్థులు ఐఐఐటి లో సీట్లు సాధించారని, ఆమె అనేకమందికి ఆదర్శంగా నిలిచారని హైమారావు ప్రశంసించారు.
తరువాత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు సుశీల మాధవిని దుశ్శాలు, పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జె. రమాదేవి, ఎ. హరగోపాల్, సుశీల మాధవి తల్లిదండ్రులు, నోబుల్ టీచర్స్ అసోసియేషన్ నగర నాయకులు షేక్ అబ్దుల్ ఖలీల్, పి. లలితబాబు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.