ఆర్టీసి అవినీతీ అధికారులపై వేటు.. ఎంప్లాయిస్ అసోసియేషన్ హర్షం
ఏపీఎస్ఆర్టీసీలో అవినీతి ఉదంతంపై కఠిన చర్యలు – కడప, విజయవాడ జోన్లలో సస్పెన్షన్లు
ఏపీఎస్ ఆర్టీసీలో కడప, విజయవాడ జోన్ల విజిలెన్సు & సెక్యూరిటీ విభాగాల్లో వెలుగుచూసిన అవినీతి ఆరోపణలపై సంస్థ కఠినంగా స్పందించింది. పిటిడీ కమిషనర్ మరియు ఆర్టీసీ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు పూర్తి స్థాయి విచారణ చేపట్టారు.
విచారణలో అవినీతి తేటతెల్లం కావడంతో కడప విజిలెన్సు & సెక్యూరిటీ ఆఫీసర్ను సస్పెండ్ చేశారు. ఇతడి అవినీతిలో కీలక పాత్ర వహించిన తొమ్మిదిమంది సెక్యూరిటీ సిబ్బందిని కూడా సస్పెండ్ చేశారు. విజయవాడ జోన్ వి&ఎస్ఓను ప్రధాన కార్యాలయానికి సరెండర్ చేశారు.
ఈ చర్యలను ఏపిపీటిడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ స్వాగతించింది. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు, ప్రధాన కార్యదర్శి జి.వి. నరసయ్య మంగళవారం ఒక ప్రకటనలో స్పందిస్తూ, అవినీతిని సహించకుండా చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు.
బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి – యూనియన్ డిమాండ్
కడప విజిలెన్సు అధికారి వసూలు చేసిన లంచం మొత్తాన్ని ఆర్టీసీ సీసీఐఎస్ ఖాతాలో రూ.52 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్గా జమ చేశారు. ఈ డబ్బును ఉపయోగించి ఆర్థికంగా నష్టపోయిన బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలంటూ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు.
లంచం ఇవ్వని కార్మికులకు విధించిన శిక్షలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్కు లేఖ అందించారు. బాధితులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని యూనియన్ నేతలు స్పష్టం చేశారు.