ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ఏపీ జేఏసీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. ఆదివారం రెవిన్యూభవన్లో జరిగిన రాష్ట్ర ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ & కాంట్రాక్టు డ్రైవర్ల వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఈ సమావేశానికి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి. నాగరాజు అధ్యక్షత వహించారు.
బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, “మెప్మా, సెర్ప్ ఉద్యోగుల తరహాలోనే లక్షలాది మందికి పైగా ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రభుత్వం హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలు వీరందరికీ అందేలా చూడాలి” అని ప్రభుత్వాన్ని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ కృషి చేస్తుందని తెలిపారు.
మరొక ముఖ్య అతిథి, ప్రభుత్వ డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సంసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఔట్సోర్సింగ్ మరియు కాంట్రాక్టు డ్రైవర్లకు జీతభత్యాలు పెంచాలని, ఆరోగ్య కార్డులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు గారు వ్యక్తిగత, కుటుంబ కారణాల రీత్యా పదవి నుంచి తప్పుకుంటున్నట్లు రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఇప్పటివరకు వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసిన ఈడుపుగంటి మోహనరావును ఏకగ్రీవంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. మిగిలిన రాష్ట్ర కమిటీ యథావిధిగా కొనసాగుతుందని సమావేశం వెల్లడించింది.
త్వరలో రాష్ట్రంలోని అన్నిజిల్లాల్లో జిల్లా కమిటీల నిర్మాణం చేపట్టి సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు.
ఈ సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి స్టేట్ సెక్రటరీ జెనరల్ & ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు, ఏపీ డ్రైవర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. పాపారావు, ఎన్టీఆర్ జిల్లా డ్రైవర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి. వెంకటేశ్వరరావు సహా రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఔట్సోర్సింగ్ డ్రైవర్లు హాజరయ్యారు.