కూటమి ప్రభుత్వంలో... ఉద్యోగులకు అనుకూల వాతావరణం
-డీఏ విడుదల, పదోన్నతుల పరిష్కారం, పాత పెన్షన్ స్కీమ్ అమలు హర్షణీయం
-ఉద్యోగుల పట్ల ప్రభుత్వం స్నేహపూర్వక దృక్పథం ప్రదర్శనపై ఏపీ ఎన్జిజిఓ సంఘం ప్రసంశ
గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలలో ఒక విడతను విడుదల చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథాన్ని ప్రదర్శించిందని గుంటూరు జిల్లా ఏపీ ఎన్జిజిఓ సంఘం అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, కార్యదర్శి ఆరాధ్య శ్యాంసుందర్ శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఫ్రెండ్లీ గవర్నమెంట్గా నిలుస్తోందని వారు కొనియాడారు.
ఏళ్ల తరబడి రోడ్డు రవాణా శాఖలో పెండింగ్లో ఉన్న పదోన్నతులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించడం, నూతన పీఆర్సీ అమలుకు కమిషనర్ నియామకానికి చర్యలు ప్రారంభించడం, 2004 నోటిఫికేషన్కు ముందు నియామకమైన ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ వర్తింపజేస్తామని సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయాలని పేర్కొన్నారు.
అలాగే ఉద్యోగ సంఘ భవనాలకు ఆస్తిపన్ను పూర్తిగా (బకాయిలతో సహా) రద్దు చేయడం, చైల్డ్ కేర్ లీవ్ను పదవీ విరమణ వరకు వినియోగించే అవకాశం కల్పించడం వంటి నిర్ణయాలు ఉద్యోగ సంక్షేమానికి దోహదపడతాయని తెలిపారు. గత ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు రూ.25 వేల కోట్లలో ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు రూ.10 వేల కోట్ల రూపాయలు చెల్లించడం శుభపరిణామమన్నారు.
ఎర్న్డ్ లీవ్ ఎన్క్యాష్మెంట్ బిల్లులు కూడా కాలక్రమేణా చెల్లిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం ఉద్యోగులకు ఊరట కలిగించిందన్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని కలుసుకోవడం కూడా కష్టంగా ఉండేదని, ఇకపై ముఖ్యమంత్రి స్వయంగా ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించడం ఉద్యోగులకు గౌరవాన్ని చాటుతోందని తెలిపారు.
ఈ ప్రయోజనాలు సాధించడానికి ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి డివి రమణ మరియు కార్యవర్గ సభ్యులు ప్రభుత్వంతో అనేక దఫాలుగా చర్చలు జరిపిన ఫలితమిదని వెల్లడించారు.
ఈ ప్రకటనపై సంతకాలు చేసిన వారిలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ నాగూర్ షరీఫ్, జిల్లా ఉపాధ్యక్షుడు సూరేపల్లి రాజశేఖర్, జిల్లా సంయుక్త కార్యదర్శులు కృష్ణ కిషోర్, కూరాకుల శ్రీనివాసరావు, సయ్యద్ జానీబాషా, కార్యనిర్వాహక కార్యదర్శి సుకుమార్, నగర అధ్యక్ష కార్యదర్శులు సూరి, కళ్యాణ్ కుమార్, మహిళా విభాగం నాయకురాలు శ్రీవాణి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.