ప్రెవేటు ట్రావెల్స్పై అరికట్టండి — ఆర్టీసీ సర్వీసులు దూరప్రాంతాలకు విస్తరించాలి
-ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్
అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ప్రెవేటు ట్రావెల్స్ బస్సులను ప్రభుత్వం కట్టడి చేసి, ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించే విధంగా ఆర్టీసీ సేవలను దూరప్రాంతాలకు విస్తరించాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. భారత్లో అత్యంత సురక్షిత ప్రజారవాణా సంస్థగా నిలిచింది ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు తెలిపారు.
రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు, ప్రధాన కార్యదర్శి జి.వి.నరసయ్య శనివారం విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణీకుల అవసరాల మేరకు ఏసీ, స్లీపర్ బస్సుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా దొంగ పర్మిట్లతో ఇతర రాష్ట్రాలలో నమోదైన ప్రెవేటు ట్రావెల్స్ బస్సులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయన్నారు. వార్షికంగా సుమారు రూ.1500 కోట్ల మేర ఆర్టీసీ ఆదాయానికి గండికొడుతున్న అక్రమ రవాణాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
శుక్రవారం కర్నూలులో జరిగిన ప్రెవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదం అత్యంత దుర్ఘటనగా వర్ణిస్తూ, భవిష్యత్లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడం అనివార్యమని అన్నారు. తక్కువ జీతాలకు అనుభవం లేని డ్రైవర్లను నియమించడం, వేగ పరిమితులు పాటించకపోవడం, డబుల్ డ్రైవర్ లేని వాహనాలను నడపడం వంటి అంశాలు ప్రమాదాలకు దారి తీస్తున్నాయని దామోదరరావు అభిప్రాయపడ్డారు. ప్రయాణీకులు వేగం కంటే సురక్షిత ప్రయాణాన్నే ప్రధానంగా తీసుకోవాలని, ప్రజారవాణా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆర్టీసీ బస్సులను ప్రోత్సహించాలని యూనియన్ నాయకులు విజ్ఞప్తి చేశారు.

