పురపాలక స్కూళ్లకు 2020 కొత్త పోస్టులు – పదోన్నతుల వంతు వచ్చిందన్న ఎంటీఎఫ్
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్): రాష్ట్రంలోని పురపాలక పాఠశాలల్లో 2020 కొత్త టీచర్ పోస్టులు మంజూరు చేయడంతో పాటు, పదోన్నతుల ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ లభించిందని పురపాలక టీచర్స్ ఫెడరేషన్ (ఎంటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. రామకృష్ణ వెల్లడించారు.
ఇప్పటివరకు 20 సంవత్సరాలుగా ఈ అంశంపై నిరంతరంగా వినతులు ఇచ్చినప్పటికీ స్పందన రాలేదని, కాగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతించిన మేరకు పురపాలక ప్రాంతాల్లో 63 హెచ్ఎంలు, కార్పొరేషన్ పరిధిలో 41 హెచ్ఎంల పోస్టులు మంజూరయ్యాయి. అదే విధంగా అన్ని సబ్జెక్టుల వారీగా 2016 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు కాగా, అదనంగా ఇద్దరు ఎస్జీటీ పోస్టులు కూడా మంజూరయ్యాయని రామకృష్ణ వివరించారు.
ఇన్నాళ్లుగా పదోన్నతులకోసం ఎదురు చూస్తున్న పురపాలక టీచర్లకు ఇది ఊరటనిచ్చే నిర్ణయమని, పాఠశాలల అభివృద్ధికి ఇది మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు.