ప్రైవేటు టీచర్లకు హెల్త్ కార్డుల మంజూరు చేయాలి
మంత్రి నారా లోకేశ్ కు వినతిపత్రం అందించిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్
అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ప్రైవేటు టీచర్లకు హెల్త్ కార్డుల మంజూరు, ఉర్దూ భాషాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ కు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ విన్నవించారు. రాష్ట్ర సచివాలయంలో విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ను ఎమ్మెల్యే నసీర్ మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతిపత్రం అందించారు. రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల్లో పని చేసే టీచర్లు విద్యార్థులను తీర్చిదిద్దడంలో శక్తివంచన లేకుండా పని చేస్తున్నారని, వీరు ఆరోగ్య పరంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అనారోగ్యానికి గురైనప్పుడు చికిత్స తీసుకునే స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రైవేటు టీచర్లకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని విన్నవించారు. ప్రైవేటు టీచర్లు కరోనా సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉర్దూ సాహిత్యానికి ప్రోత్సాహం, ఉర్దూ మాధ్యమంలో చదివే విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు ద్వారా చేయడంపై సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా రాష్ట్రంలో డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ ప్రస్తుతం కర్నూలులో మాత్రమే ఉందని, అమరావతి రాజధానిలో కూడా యూనివర్సిటీ రీజనల్ బ్రాంచ్ ఏర్పాటు చేయాలని కోరారు. రాజధానిలో రీజనల్ బ్రాంచ్ ఏర్పాటు ద్వారా ఉర్దూ మాధ్యమంలో వృత్తి, సాంకేతిక విద్యను అందించడానికి ఈ ప్రాంత ప్రజలకు అనుకూలంగా ఉంటుందని తెలిపారు. ఉన్నత పాఠశాలల్లోనూ ఉర్దూ భాషాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో నూతనంగా ఉర్దూ పాఠశాలలు ఏర్పాటు చేయాలని విన్నవించారు. ప్రస్తుతం పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉర్దూ టీచర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో పార్టీని తమ భుజస్కందాలపై మోసిన కార్యకర్తలకు నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానం కల్పించాలని విన్నవించారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే ఊపిరి జెండా అని చెప్పారు. పై సమస్యలను సావధానంగా ఆలకించిన మంత్రి నారా లోకేశ్ ప్రతి సమస్యా పరిష్కారంపై తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే నసీర్ కు హామీ ఇచ్చారు.