117 జీవో రద్దు పేరుతో పాఠశాలలను ప్రయోగశాలలుగా మార్చొద్దు!
అసంబద్ధాలపై ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ మంత్రి చర్చించాలి: ఏపిటిఎఫ్
అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : పాఠశాల విద్యలో 117 జీవోను రద్దు చేసే క్రమంలో పాఠశాలలను ప్రయోగశాలలుగా మార్చవద్దని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. హృదయ రాజు, ఎస్.చిరంజీవి ప్రభుత్వానికి సూచించారు. గత ప్రభుత్వంలో 117 జీ.వో ద్వారా 3,4,5 తరగతులను కిలోమీటర్ పరిధిలో గల ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం,అదే క్రమంలో ఉపాధ్యాయులకు పీరియడ్ల సంఖ్య పెంచడం, సమాంతర మీడియంలను రద్దు చేయడం జరిగింది. ఈ అసంబద్దాలను మార్పు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరడం, నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఒక విద్యా సంవత్సరం అనంతరం 117 జీవో రద్దు చేయుటకు శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే 117 రద్దు చేయు క్రమంలో నూతన ప్రయోగాలు చేయడం ద్వారా పాఠశాల విద్యలో కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం కనపడుతున్నది. ఇప్పటివరకు విద్యాశాఖ నిర్వహించిన అనేక సమావేశాల్లో కొన్ని అంశాలపై విజయం సాధించడం జరిగింది. ప్రాథమికోన్నత పాఠశాలలను నిలుపుకొని స్కూల్ అసిస్టెంట్లు నియమించుకోనేటట్లు చేసుకోవడం, అదేవిధంగా ప్లస్ టు విధానాన్ని కొనసాగేలా చేసుకోవడం జరిగింది.ఇక మిగతా అనేక అంశాలు ప్రయోగాలుగా కనపడుతున్నాయి. సమాంతర మాధ్యమం, మైనర్ మీడియం లేకపోవడం, 1,2 తరగతులను 1660 ఉన్నత పాఠశాలలకు తరలించడం, తొమ్మిది రకాల ప్రాథమిక పాఠశాలల రూపకల్పన చేయడం, ఎలిమెంటరీ పాఠశాలలకు సబ్జెక్ట్ టీచర్లను పంపాలి అనుకోవడం , ఫౌండేషన్ పాఠశాలల్లో ఉపాధ్యాయ: విద్యార్థి నిష్పత్తి 1:30,ఉన్నత పాఠశాలల్లో 1:54 పాటించాలనుకోవడం, టీచర్లకు పీరియడ్స్ తగ్గించకపోవడం, పూర్వ ప్రాథమిక పాఠశాలలకు నిర్దిష్టమైన విధానాన్ని రూపొందించకపోవడం తదితర అసంబద్ధ విధానాల ద్వారా పాఠశాల విద్య ప్రయోగశాలలుగా మారే అవకాశాలు కనపడుతున్నాయని ఏపిటిఎఫ్ తెలిపింది.
హేతుబద్ధీకరణ, బదిలీలు:
పాఠశాలల హేతుబద్ధీకరణ ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కోరకంగా విధానాలను రూపొందించి పోస్టులను అటు ఇటు మార్చడంతో ఉపాధ్యాయులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. 3 2 , ఒకసారి రేషన్లైజేషన్ కు గురవుతున్న ఉపాధ్యాయులకు సరైన ప్రాధాన్యతలు ఇవ్వకపోవడంతో సందిగ్ధంలో ఉన్నారు. ఏకికృత సర్వీస్ రూల్స్ సాధించకపోయిన ఒక పాఠశాలలో 8 సంవత్సరములు నిండిన ప్రధానోపాధ్యాయులు/ ఉపాధ్యాయులు సొంత మేనేజ్మెంట్కు వెళ్లాలి అని తెలుపడం గందరగోళానికి దారితీస్తున్నది. ఇక బదిలీల్లో అంగవైకల్యం గల వారికి గత ఉత్తర్వుల మాదిరి ప్రాధాన్యతను కల్పించండి అని కోరినా పట్టించుకోకపోవడం వల్ల, వారు హైకోర్టుకు వెళ్లడం హైకోర్టు వారి స్థానాలను ఖాళీలుగా చూపకుండా ఉంచాలని తెల్పడం జరిగిందన్నారు.వారిలో బదిలీలు కావలసిన వారి పరిస్థితి అర్థం కావడం లేదు. వృద్ధాప్యంలో రిటైర్మెంట్ కు 3 సం.ల లోపు ఉన్న వారికి బదిలీల నుండి మినహాయింపు లేదు. ఇటువంటి అసంబద్ధ విధానాలపై ఉత్తర్వులు వెలువడక ముందే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి చర్చించి శాస్త్రీయమైన, ఆచరణ సాధ్యమైన విధానాలను రూపొందించాలని ఏపీటీఎఫ్ ప్రభుత్వాన్ని కోరింది.