ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి స్వయంగా స్పందించడం హర్షణీయం
- ఎపి ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా స్పందించడం హర్షణీయమని ఎపి ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి,రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ అధ్యక్షులు అంకాల్ కొండయ్య, మోడల్ స్కూల్స్ ప్రోగ్రెస్సివ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కోమటిరెడ్డి శివ శంకర్ రెడ్డి లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్యోగులతో చర్చల కోసం మంత్రుల బృందాన్ని నియమించడం, తరువాత స్వయంగా తానే వారితో చర్చించి సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించడం రాష్ట్ర ఉద్యోగులకు శుభపరిణామని వారు చెప్పారు.
ఈ సందర్భంగా సీఎం ఒక డీఏ విడుదల చేసినందుకు వారు కృతజ్ఞతలు తెలియచేశారు. గత ప్రభుత్వ హయాంలో సమస్యలతో వివిధ ఉక్కిరిబిక్కిరి అయిన ఉద్యోగులతో అప్పటి ముఖ్యమంత్రి ఏనాడూ చర్చించకపోగా రివర్స్ పీఆర్సీతో ఉద్యోగులకు తీవ్ర నష్టం కలిగించారన్నారు.
ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్యోగుల సమస్యలు గుర్తించి వారితో చర్చలు జరిపారని అయితే ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తే ఉద్యోగులు రుణపడి ఉంటారన్నారు. పీఆర్సీ కమిటీ వేసి ఐఆర్ ప్రకటించాలని, సీపీఎస్ రద్దు చేయాలని,ఏకీకృత సర్వీసు నిబంధనలు అమలుచేయాలని,223 జీవో రద్దు చేసి పాఠశాల సహాయకులకు జూనియర్ అధ్యాపకులుగా పదోన్నతులు కల్పించాలని,ఎపి మోడల్ స్కూల్ పీజీటీ ఉపాధ్యాయులకు జె యల్ పదోన్నతులు మరియు ఇతర సమస్యల పరిష్కారం, అన్ని రకాల గురుకుల పాఠశాలలను ఒకే కమీషనరేట్ పరిధిలోనికి తీసుకురావాలని, కేజీబీవీ , ఇతర ఒప్పంద అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని,పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించాలని, బోధనేతర యాప్ లు రద్దుచేయాలని వారు కోరారు.